హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. హైదరాబాద్లో (Hyderabad) రాత్రి నుంచి తేలికపాటి వర్షం (Rain) కురుస్తున్నది. ఇక జగిత్యాల జిల్లా జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో వాన పడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్ పట్టణం, జిల్లాలోని పలు గ్రామాల్లో వాన కురుస్తున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరువరంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా వాన కురిసింది. ఇక భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాటారం, పలిమెల, మహాముత్తారం మండలాల్లో తేలికపాటి వర్షం వస్తున్నది.
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నదని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్యం దిశగా కదులుతూ రాగ ల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
దిగువ స్థాయిలోని గాలులు పశ్చి మ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 19, 2023