Rain Alert | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదురోజులపాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేరొన్నది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మరోవైపు పలు ప్రాంతాల్లో వడగాలులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో అకడకడా వర్షం కురిసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్, హనుమకొండ, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అకడకడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేరొంది. మంగళవారం సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
పెరుగుతున్న వడదెబ్బ మృతులు
రాష్ట్రంలో వారం నుంచి భానుడి భగభగలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం వివిధ జిల్లాల్లో ఏకంగా 19 మంది వడదెబ్బ సోకి మృతిచెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు ఉడికిపోయాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం కూడా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిగిత్యాల జిల్లా గోదూరులో 46.8, అల్లీపూర్లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంక 46.7, నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 46.5, మంచిర్యాల జిల్లా జెన్నారం 46.3, హజీపూర్ 46.3, వెల్లనూర్ 46.2, నిజామాబాద్ నార్త్ 46.2, కాగజ్నగర్లో 46.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పడిపోతున్న తేమశాతం
రాష్ట్రంలో తేమ శాతం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీని వల్ల వాతావరణం పొడిబారి ఉష్ణతాపానికి దారితీస్తున్నది. వాతావరణం చల్లగా ఉండాలంటే గాలిలో తేమ శాతం సమంగా ఉండాలి. కనీసం 50 శాతం ఉన్నా వేడి తీవ్రత అంతగా ఉండదు.