జూబ్లీహిల్స్ కేసులో పక్కా ఆధారాలతో కోర్టుకు
అరెస్టయిన నిందితుల్లో ఒకరు మేజర్.. ఐదుగురు మైనర్లు
ఇన్నోవా కారులోనే బాలికపై సామూహిక లైంగికదాడి
కేసు విచారణకు స్పెషల్ కోర్టు
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్లో లైంగికదాడి కేసులో నిందితులపై పటిష్టమైన సెక్షన్లు నమోదుచేశామని, నేరం రుజువైతే ఆజన్మాంతం జైలు లేదా మరణశిక్ష పడే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసులో జరిగిన దర్యాప్తు పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. అరెస్టయిన వారిలో సాదుద్దీన్ మాలిక్ మినహా మిగిలిన ఐదుగురు మైనర్లు అని, వారి వివరాలు వెల్లడించలేమని అన్నారు. కాగా అరెస్టయిన వారిలో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నట్టు సమాచారం. కమిషనర్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థి స్కూల్స్ ప్రారంభానికి ముందు హైదరాబాద్లో ఒక పార్టీ ఏర్పాటుచేయాలని భావించాడు. ఇందుకు హైదరాబాద్లోని ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. వారు జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్ను సూచించారు. వీరు మైనర్లు కావడంతో ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్ను బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.1200 ఉండగా, బేరమాడి రూ.900కు కుదుర్చుకున్నారు. పార్టీ విషయమై ఒక మైనర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. మే 28న పార్టీకి తేదీ ఖరారు చేసుకొని మరోసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. స్నేహితుల నుంచి మంచి స్పందన వచ్చింది. టిక్కెట్ ధర తగ్గించిన విషయాన్ని ఇతరులకు చెప్పకుండా అందరి నుంచి రూ.1200 వసూలు చేశారు. పబ్లో అడ్వాన్స్గా రూ. లక్ష చెల్లించారు. బాధితురాలు కూడా తన స్నేహితుల ద్వారా ఒక టిక్కెట్ కొనుగోలు చేసింది.
బాలిక ఎలా చిక్కింది
పార్టీ జరిగిన రోజున బాధితురాలు మరో స్నేహితునితో కలిసి మధ్యాహ్నం 1.10కి పబ్కు వచ్చింది. వీరిద్దరూ 1.50 వరకు డ్యాన్స్ చేసిన తరువాత స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు మరో స్నేహితురాలితో అక్కడే గడిపింది. 3.15 గంటలకు నిందితుల్లో ఒకడు బాధితురాలితో మాటలు కలిపాడు. ఆ తరువాత సాదుద్దీన్ వచ్చి కలిశాడు. వీరిద్దరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. సాయంత్రం 5.10 తరువాత వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీనంతటినీ ఇతర నిందితులు గమనిస్తూ ఉన్నారు. దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి 5.40కి బయటకు వచ్చేసింది. అప్పుడే ఆమెపై లైంగికదాడికి పాల్పడాలని నిందితులంతా ప్రణాళిక వేసినట్టు తెలుస్తున్నది. ఆమెను పబ్ బయట కూడా వారు అనుసరించారు. బాధితురాలి స్నేహితురాలు ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపోయింది. ఆ తరువాత ఇతర నిందితులు ఆమెతో మాటలు కలిపి ట్రాప్ చేశారు. 5.43కు సాదుద్దీన్తోపాటు నలుగురు నిందితులు బాలికను మెర్సిడెస్ బెంజ్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి బేకరీకి వెళ్లారు. కారులో తిప్పుతూనే ఆమెకు బలవంతంగా ముద్దులు పెట్టేందుకు ప్రయత్నించారు. తమ వికృత చర్యలన్నీ వీడియోలు తీసి సర్కులేట్ చేశారు. 5.54కు బాలిక బెంజ్ కారు దిగి ఇన్నోవాలోకి మారింది. 6.15కు ఇన్నోవా బేకరీ నుంచి వెళ్లిపోయింది. ఇన్నోవాలో సాదుద్దీన్, బాధితురాలు, ఐదుగురు మైనర్లు ఉన్నారు. 6.18కి ఒక మైనర్ ఇన్నోవాలో నుంచి బయటకు వచ్చాడు. మిగిలినవారు రోడ్డు నం.44లో ఒక నిర్జన ప్రదేశంలో ఇన్నోవా ఆపి ఒక మైనర్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత మిగిలినవారు కారును తిప్పుతూ ఆమెపై లైంగికదాడి చేశారు. దీంతో బాధితురాలి మెడ, శరీరం, ఇతర చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. 7.51కి బాధితురాలిని మళ్లీ పబ్ వద్దకు తీసుకొచ్చి వదిలేశారు. 7.53కు ఆమె తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి తీసుకెళ్లాడు.
జీవితఖైదు పడే అవకాశం
మే 28న ఘటన జరిగినప్పటికీ బాధితురాలు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె మెడపై ఉన్న గాయాలు చూసి తల్లిదండ్రులు 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, భరోసా కేంద్రానికి పంపించామని సీవీ ఆనంద్ తెలిపారు. భరోసా కేంద్రంలో ధైర్యం చెప్పడంతో ఆమె తనపై జరిగిన ఘటనను వెల్లడించిందన్నారు. అనంతరం కేసులోని సెక్షన్లను మార్చామని చెప్పారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి సాదుద్దీన్ మాలిక్తోపాటు మరో ఐదుగురు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు. పబ్, బేకరీలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. నిందితుల్లో ఐదుగురు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా ఆరో మైనర్ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. కాబట్టి అతనిపై కూడా కేసు పెట్టామని చెప్పారు. తాము నమోదుచేసిన సెక్షన్లను బట్టి నిందితులకు మరణించేంత వరకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా పడే అవకాశమున్నదని కమిషనర్ పేర్కొన్నారు. బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందని, కేసు విచారణ ప్రత్యేక కోర్టులో జరుగుతుందని చెప్పారు.