హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచి, ధారాళంగా చదివేలా తయారు సేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బడుల్లో పెద్ద ఎత్తున గ్రంథాలయాలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, తాజాగా మరో 2,732 హైస్కూళ్లలో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. వీటిలో 998 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. గ్రంథాలయాలు ఏర్పాటు చేసే ఒక్కో బడికి 120 పుస్తకాలను అందజేస్తారు. ఈ పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) ద్వారా తెప్పించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని 5 వేల ప్రాథమిక పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలను అందజేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి కోసం మొత్తంగా 6 లక్షల పుస్తకాలు అవసరమవుతుండగా, వీటి ముద్రణ ప్రక్రియను ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ ద్వారా ఇటీవలే ప్రారంభించారు. ఇదే తరహాతో ఉన్నత పాఠశాలల్లోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి కథల పుస్తకాలు, పఠనాసక్త్తిని పెంచే పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు.
గ్రంథాలయ పీరియడ్..
కరోనా కారణంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తగ్గాయి. కొంత మంది చదవలేకపోతుండగా, మరికొంత మంది రాయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని ఇటీవలే తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బడుల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం అనేక రకాల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈ పుస్తకాలు బడులకు చేరగానే, గ్రంథాలయ పీరియడ్ను నిర్వహించి, రోజుకు 15 నిమిషాలు పాటు చదివిస్తారు. ప్రతి టీచర్ తమతమ సబ్జెక్టులు, సంబంధిత ఇతర పుస్తకాలను విద్యార్థులతో చదివించాలని విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆదేశించారు. పుస్తకాలన్నింటిని విద్యార్థులతో చదివించి కనీన సామర్థ్యాలను సాధించేలా కృషి చేస్తారు.