హుజూరాబాద్, అక్టోబర్ 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై రెండున్నరేండ్లు గడిచినా కేంద్రం నుంచి రూపాయి అయినా తెచ్చారా? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రశ్నించారు. గురువారం హుజూరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా కాజీపేట, హుజూరాబాద్, మానకొండూర్ మీదుగా కరీంనగర్ వరకు రైల్వే లైన్ కోసం నిధులు మంజూరు చేయించానని, ఇప్పుడు అదీ రద్దయితే, కనీసం బండి సంజయ్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఈ రైల్వేలైన్ ఏర్పాటయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందేదని, ఇప్పుడు రైల్వేలైన్ రద్దుతో ప్రజల్లో నిరాశ ఉన్నదని, దీనిపై బండి సంజయ్, ఈటల రాజేందర్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గతంలో మనోహరాబాద్- కొత్తపల్లి లైన్ కూడా రద్దు కాగా, తాను పట్టుబట్టి తిరిగి మంజూరు చేయించానని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిచిన అనంతరం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు సులువవుతుందన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.