పెద్దపల్లి : కుల, మతోన్మాదులు, బీజేపీ చేతిలో ఉన్న దేశాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతని పెద్దపల్లి ఎంపీ(Pedpadalli MP)బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ (BRS)పెద్దపల్లి పట్టణ కమిటీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం పేరుతో కాకుండా నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజిస్తూ పాలిస్తున్నదని మండిపడ్డారు. దేశ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తొమ్మిది మంది ప్రభుత్వ విధానాలను ప్రతీ రోజూ ప్రశ్నిస్తున్నామన్నారు. బీజేపీ, ఆ పార్టీ మిత్ర పక్ష ఎంపీలు దాదాపు 350 మందిపై తాము యుద్ధం చేస్తున్నామన్నారు.
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్త దేశం కోసం, దేశ ప్రజల కోసం మరో మారు రాష్ట్రంలో, ఈసారి దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో వంద సీట్లను బీఆర్ఎస్ ఒంటి చేత్తో గెలిపించుకొని సీఎం కేసీఆర్ (CM KCR ) నాయకత్వంలో అధికారంలోకి రావాలన్నారు. దేశ వ్యాప్తంగా ఈసారి బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని యావత్ దేశం చూస్తున్నదని పేర్కొన్నారు.
2001లో పార్టీని స్థాపించిన నాటి నుంచి కార్యకర్తలు ఏ విధంగా సైనికుల్లా పనిచేశారో, అదే తీరుగా బీఆర్ఎస్ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి, టీఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.