ముషీరాబాద్ : పోస్టులు తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టత వచ్చేలా ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపి, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నవి గుర్తించిన తరువాతనే నోటిఫికేషన్ (Notification) వేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, కరుణశ్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గ్రూప్-1 సర్వీస్లో 1,600 పోస్టులకు 503, గ్రూప్-2లో సర్వీస్ కింద 2,200లకు గాను 783, గ్రూప్-3 సర్వీసెస్లో మూడు వేలకు బదులు 1,383, గ్రూప్-4లో 8,500, టీచర్ పోస్టులు 25 వేలకు బదులు 11వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అరకొర నియామకాలతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను లెక్కించడంతో సరిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఖాళీలను తక్కువగా చూపుతున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో పూర్తి స్థాయి డైరెక్టు రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో 40 శాఖలకు సబంధించిన కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలలో ఆప్షన్ పద్దతి, వెయిటింగ్ లిస్టు కాలపరమితి ప్రవేశపెట్టి పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ ఏర్పడకుండా అందరికి అవకాశం లభిస్తుందన్నారు.