వరంగల్ అర్బన్ : ఆదర్శ, స్వచ్ఛ వరంగల్ నగర నిర్మాణం కోసం జులై 1 నుంచి 10 వరకు జరిగే పట్టణ ప్రగతిలో నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ నగర పాలక సంస్థ తొలి పాలకవర్గ సమావేశానికి హాజరై మేయర్, కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాజకీయాలకు అతీతంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.
ప్రతి కార్పొరేటర్ తన డివిజన్ అభివృద్ధికి పోటీ పడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగరానికి అత్యధిక నిధులు వస్తున్నాయి. స్థానిక నాయకత్వం మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు మేం కృషి చేస్తామని హామీనిచ్చారు. మీరు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమంతో సీజనల్ వ్యాధులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దే డివిజన్ లకు రూ.50 లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
ఓపెన్ ప్లాట్లలో చెట్లు, నీటి నిలువలు ఉంటే నోటీసులు జారీ చేయాలి. స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి డివిజన్ లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీ పి.దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, డా.టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి