హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మన బస్తీ-మన బడి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో మన బస్తి- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలలు, హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలల్లో మన బస్తీ -మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు సన్నబియ్యం తో మధ్యాహ్న భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.