జనగామ : తడిసిన ధాన్యాన్ని కొంటామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 195 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఎటువంటి సహాయం చేయట్లేదన్నారు.
కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ర్ట ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రూ.30 వేల కోట్లు అప్పు తీసుకొని రైతుల ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు 12 వేల 224 మంది రైతుల నుంచి 73 వేల 886 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
5 వేల 542 మంది రైతుల ఖాతాలకు రూ. 57 కోట్ల 9 లక్షల 96 వేలు జమచేసినట్లు ఆయన తెలిపారు. రైతులు సంయమనంతో ఓపిక పట్టాలని, కొంత ఆలస్యమైనా పండించిన చివరి గింజ కొంటామని మంత్రి తెలిపారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందిన జర్నలిస్ట్ పాపయ్య కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి