హైదరాబాద్ : అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోస్ వేసుకుంటున్నాయి. మనం అదే దారిలో నడవాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసితో కలిసి చార్మినార్ వద్ద గల ప్రభుత్వ యునాని దవాఖానలో బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
బూస్టర్ డోసును ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇద్దరు ఎమ్మెల్యేలకు వాక్సిన్ వేస్తూ.. బూస్టర్ డోసు ప్రారంభిచడం సంతోషంగా ఉంది. అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హులైన వారు బూస్టర్ తీసుకోవాలి.
అందరికి ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మాకు మొదటి డోస్ సమయంలో చాలా సహకారం అందించారు. బూస్టర్ డోస్, 15 ఏళ్ళు పై బడిన వారికి టీకా విషయంలోను ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. టీకా విషయంలో ఎలాంటి సంశయాలు అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు.
మొదటి డోస్ వందశాతం పూర్తి అయింది. కేవలం వారం రోజలో 15 నుంచి 18 ఏండ్ల మధ్య వారిలో 38 % మందికి మొదటి డోస్ టీకా పూర్తి అయిందని మంత్రి తెలిపారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యునానీ దవాఖానలో సమస్యలపై ఇప్పుడే చర్చించాం.
పక్షవాతం వంటి వాటికి చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం యునానీ దవాఖానకు రోగులు వస్తుంటారు.దవాఖాన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు. అవసరం అయిన నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యం.
ఏదో జరుగుతుంది అనే అపోహ వద్దన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనాపై చేస్తున్న పోరులో ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు.