హైదరాబాద్ : ఎన్నికల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బడుగు, బలహీన వర్గాల ప్రజలను వంచించిందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతివనంలో జరిగిన జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు తీరుపైన, ఆ సర్కారు ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన తీరుపైన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రతి దళిత, గిరిజన సోదరసోదరీమణులకు తెలియజేయాలని, అందరం కలిసి కాంగ్రెస్ సర్కారు మోసాన్ని ఎండగడుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీలకు 16 శాతంగా ఉన్న రిజర్వేషన్ను 18 శాతానికి పెంచుతామని, ఎస్టీలకు 10 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అన్ని వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ.6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితబంధు, రైతుబంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి పథకాలను తీసుకురావడం అందరికీ సాధ్యం కాదని, కేసీఆర్ లాంటి ఖలేజా ఉన్న నాయకులకే సాధ్యమని అన్నారు.