సిద్ధిపేట : కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ధ్వజమెత్తారు. బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. మంగళవారం ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏండ్ల నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్టలు నిలబెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందననారు. వందల కోట్ల నిధులు కేటాయించి ఎంతో వెనుకబడిన గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు.
కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో కేసీఆర్ను గెలిపించాలని గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.