సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్ మండలంలో చిరుత పులుల సంచారం కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని జూకల్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతంలో చిరుత పులులు తిరుగుతున్నాయి. సోమవారం చిరుతలను చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పులుల పాదముద్రలు సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, చిరుత పులులు తిరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాటిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు.