కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో ఆవుపై చిరుతపులి దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రైతు పుట్ట అనంతరెడ్డి తన పశువులను రోజు వారీగా గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద పశువుల కొట్టంలో కట్టివేశాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆవుపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున రైతు వెళ్లి చూసే సరికి ఆవు మృతి చెంది ఉండడంతో కన్నీటి పర్వాంత మయ్యాడు. సుమారు 70వేల విలువ గల ఆవు మృతి చెందినట్లు రైతు వాపోయాడు.
ఇది ఇలా ఉండగా గతంలో కూడా పలుమార్లు చిరుత పశువులపై దాడి చేయడంతో మృతి చెందాయి. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుకుంటున్నారు.