Leopard | నవీపేట : నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో చిక్కింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్జాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుంచి చిరుత సంచరిస్తోంది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతంలో అధికారులు చిరుత పాదముద్రలను సేకరించి బోనును ఏర్పాటు చేశారు. చిరుత ఆ ప్రాంతం నుంచి యంచ గుట్ట ప్రాంతంలోని విఠేశ్వర్ ఆలయం వైపు సంచరిస్తుందన్న గ్రామస్తుల వినతిమేరకు శుక్రవారం రాత్రి ఆలయ సమీపంలోని ఘాట్రోడ్డు వద్ద మరో బోను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం యంచ గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్తోపాటు యువకులు బోను వద్దకు వచ్చి చూడగా బోనులో చిరుత కనిపించడంతో వెంటనే ఫారెస్టు అధికారులకు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డికి సమాచారం అందించారు. అనంతరం చిరుతను హైదరాబాద్ జూ పార్కుకు తరలించినట్లు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పద్మారావు తెలిపారు.