హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ కులాన్ని వాడుకుంటున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మత్స్య సహకార సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు. ‘మా ఫొటోలతో నీ కుల రాజకీయమేంటి?’ అని నిలదీశారు. ముదిరాజ్ మహాసభ అనుమతి లేకుండా, వ్యక్తిగతంగా తమ అనుమతి లేకుం డా ఈటల నిర్వహించిన సభలో తమ ఫొటో లు ఎలా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల అణచివేత రాజకీయాలను త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన ఈటల తన పూర్వస్థితి మరచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. మంగళవారం తెలంగాణభవన్లో ఎమ్మె ల్సీ ఎల్ రమణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముదిరాజ్ సభలో ఈటల చేసిన వ్యాఖ్యలను బండా ప్రకాశ్ ఖండించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణమే కాకుండా కులవృత్తిని రక్షించి, ప్రోత్సహించిన చరిత్ర బీఆర్ఎస్దేనని చెప్పా రు. రాజకీయంగా ముదిరాజ్లను ఎదగకుండా చేసిందే ఈటల అని మండిపడ్డారు.
ఈటలకు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బీసీ కులగణన, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని బండ ప్రకాశ్ డిమాండ్ చేశారు. ముదిరాజ్ మహాసభ రోహిణి కమిషన్కు ఇచ్చిన సిఫారసులు అమలు కోసం మోదీతో కొట్లాడాలని హితవు పలికారు. ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని అవమాన పరిచే విధంగా ఈటల వ్యవహరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనకు రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, శాసనమండలి డిప్యూ టీ చైర్మన్గా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ముదిరాజ్ మహనీయులను గుర్తించి వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే జరిపించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముదిరాజ్లకు బీఆర్ఎస్ అన్ని రకా ల అవకాశాలు కల్పిస్తున్నదని, పార్టీ పదవులు, వివిధ కార్పొరేషన్ పదవులు పొందిన వారి పేర్లను ఈ సందర్భంగా ఉదహరించారు.
మత్స్య రంగంపై తన అజ్ఞానాన్ని ఈటల బయటపెట్టుకున్నారని మత్స్య కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ చెరువులను బాగుచేసి, రిజర్వాయర్లను నిర్మించి, చెక్డ్యాములను బలోపేతం రాష్ట్రంలో సముద్రాలను తలపించేరీతిలో చేయటం వల్ల మత్స్య సంపద పెరిగిందని చెప్పారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 1,97,000 మంది సహకార సంస్థల్లో సభ్యులుగా ఉంటే, ఇప్పుడా సంఖ్య 4 లక్షలకు పైచిలుకు చేరిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2016 నుంచి రాష్ట్రంలో సృష్టించిన మత్స్య సంపద విలువ రూ.33 వేల కోట్లని వివరించారు. తాను తప్ప మరెవ్వరూ కులంలో ఎదగకూడదని కుట్రలు చేసి నాయకత్వాన్ని అణచివేసిన ఈటల అసలు బండారాన్ని బయపెడతామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలవి చౌకబారు
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్కు ఉన్న ప్రజాదరణను ఎదుర్కొలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలను దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ త్వరలో వెలువరించే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉండకుండా పోతాయని తెలిపారు.