నల్లగొండ, మార్చి 29 (నమస్తే తెలంగాణప్రతినిధి): కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతిపక్షాల గొంతునొక్కేలా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్షసాధింపు చర్యలు చేపడుతున్నదని విమర్శించారు.
ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై కోర్టు తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే అనర్హత వేటు వేయడం, ఇల్లు ఖాళీ చేయించడం వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. తన ఆప్త మిత్రుడైన అదానీ ఎల్ఐసీ, బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే చర్యలు తీసుకోవడం లేదన్నారు. లికర్ సామ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ఎమ్మెల్సీ కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు.
తమకు వ్యతిరేకంగా మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే చర్యలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ఒకరిద్దరు వ్యక్తులతో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని కాం గ్రెస్, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు. దేశానికి ఆదర్శంగా ఐటీ రంగంతోపాటు హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్న మంత్రి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశరాజకీయాల్లో యువతరానికి ఐకాన్లా నిలుస్తున్న మంత్రి కేటీఆర్పై బురదజల్లేలా బండి సంజయ్, రేవంత్రెడ్డి మాట్లాడటం సహించరానిదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరోసారి కేసీఆర్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.