హైదరాబాద్: శాసన మండలి శనివారానికి (Legislative council) వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో.. విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో పంటల బీమా నిలిపివేత, అతివృష్టితో నష్టపోయిన రైతులకు పరిహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని (Minister Niranjan reddy) వెల్లడించారు.
వర్షాలతో నష్టపోయిన ఏ పంటైనా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. బాధితులకు ఇప్పటికే రూ.151 కోట్లు అందించామన్నారు. త్వరలోనే మరో 160 కోట్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగేండ్లపాటు కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను అమలుచేశామని, దీనిద్వారా రూ.500 కోట్లు నష్టపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం సభ శనివారం ఉదయం 10 గంటలకు వాయిదాపడింది.
కాగా, శనివారం మండలిలో జీహెచ్ఎంసీలో ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్ల నిర్మాణం, ఎస్సీలకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్లు, చేపల పెంపకం-ఉత్పత్తి, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటు, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక సహాయం, హైదరాబాద్లోని పాతబస్తీలో రహదారుల నిర్మాణం, బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం, దళిత బంధు పథకం, గొర్రెల యూనిట్ల పంపిణీ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.