నూఢిల్లీ : మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 1న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇందులో భాగంగా 18-44 సంవత్సరాలున్న వ్యక్తులకు టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో 11,80,798 మంది లబ్ధిదారులకు మొదటి డోసు వేసినట్లు చెప్పింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్లో మొత్తం 16.49 కోట్లు దాటిందని తెలిపింది. శుక్రవారం ఉదయం 7 గంటల వరకు అందిన నివేదిక ప్రకారం.. 24,11,300 సెషన్ల ద్వారా 16,49,73,058 డోసులు వేసినట్లు చెప్పింది. గురువారం నాటికి వ్యాక్సిన్ డ్రైవ్ 111వ రోజుకు చేరగా.. ఒకే రోజు 23,70,298 టీకాలు అందజేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. 18,938 సెషన్లలో 10,60,064 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 13,10,234 మందికి సెకండ్ డోసు అందజేసినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో 3,31,507 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనా జాతీయ రికవరీ రేటు 81.95శాతం చేరుకుందని, ఇందులో పది రాష్ట్రాల్లో రికవరీ 72.47శాతం ఉందని పేర్కొంది. తాజాగా దేశంలో 4,14,188 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 62,194 కేసులు ఉన్నాయి. తర్వాత కర్ణాటకలో 49,058, కేరళలో 42,464 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో 71.81శాతం కొత్త కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 36,45,164కు చేరాయి.
మొత్తం క్రియాశీల కేసుల్లో 12 రాష్ట్రాల్లో 81.04శాతం ఉన్నాయని, చెప్పింది. మరో వైపు జాతీయ మరణాల రేటు పడిపోతోంది. ప్రస్తుతం 1.09శాతంగా ఉండగా.. 24 గంటల్లో 3,915 మహమ్మారికి బలయ్యారు. ఇందులో మహారాష్ట్రలో గరిష్ఠంగా 853 మంది, ఉత్తరప్రదేశ్లో 350 మంది మృతి చెందారు. కొత్త మరణాల్లో పది రాష్ట్రాల్లోనే 74.48శాతం ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. డామన్ డీయూ, దాదానగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ (యూటీ), మీజోరాంలో మరణాలు నమోదు కాలేదని తెలిపింది. దేశంలో పెరుగుతున్న కేసుల మధ్య ప్రపంచవ్యాప్తంగా సాయం అందుతోందని.. వాటిని రాష్ట్రాలు, యూటీలకు పంపుతున్నట్లు చెప్పింది.