Minister KTR | టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనుక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉంది. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారు. చదువులు పకనపెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ల కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. శవాలపైన చిల్లర ఏరుకొనే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయి.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ప్రభుత్వానికి తేడా తెలియని అజ్ఞానులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్రెడ్డికి గురువారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే వారు తనను ఇందులోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక దురదృష్టకర ఘటనను సాకుగాచూపి ఉద్యోగాలు రాకుండా ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటైందని, ఈ వాస్తవాలన్నింటినీ పకనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివి తకువతనంతో వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా.. రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ఇప్పటికే రేవంత్రెడ్డి, బండి సంజయ్ తెలివి తకువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో కొవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సిన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక వ్యాఖ్యలు చేసి రేవంత్రెడ్డి నవ్వుల పాలయ్యారని గుర్తుచేశారు. తెలివి తకువతనంలో రేవంత్తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తర్వాత వీరిద్దరూ మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. వీరిద్దరి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.
టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనుక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పకనపెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. శవాలపైన చిల్లర ఏరుకొనే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతల పిచ్చి మాటల ఉచ్చులో పడకుండా యువత పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.