నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై కామ్రేడ్స్(Left parties )కదంతొక్కారు. 146 మంది పార్లమెంటు సభ్యులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్(MPs Suspension )చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ(Nallagonda) పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడారు.
బీజేపీ ఎంపీల పాసులతో పార్లమెంటులోకి చొరబడిన వారిని వదిలేసే పార్లమెంట్ భద్రపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. పార్లమెంటులో పొగబాంబులు వేయడంతో పార్లమెంట్ భవనానికి భద్రత లేదని, భద్రత కల్పించాలని ఇండియా కూటమి సభ్యులు ప్రశ్నించినందుకే ఈ దురాగాతానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులకు బీజేపీ ఎంపీలు పాసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ పార్లమెంటు సభ్యుడిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రత గురించి రాజ్యం గురించి, దేశభక్తి గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ, హోం మినిస్టర్ అమిత్ షా గాని కనీసం నోరుమేమెదపక పోవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి నియంతృత్వ పోకడలను ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సీహెచ్. లక్ష్మీ నారాయణ, ఎండీ సలీమ్, లోడంగి శ్రవణ్ కుమార్, పి.నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.