చెల్లించని సంస్థలపై చర్యలు : మంత్రి శ్రీనివాస్గౌడ్
గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : పర్యాటకశాఖ స్థలాలకు సంబంధించి లీజు బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పర్యాటక శాఖ స్థలాల లీజుప్రాపర్టీస్పై సమీక్షించారు. సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 18 ఏండ్లుగా ఎలాంటి ప్రాజెక్టును చేపట్టకపోవడమేగాక, స్థలానికి లీజు అద్దె కూడా చెల్లించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో లీజును రద్దు చేసి స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. బేగంపేటలోని బుట్ట హాస్పిటాలిస్ సంస్థ (యాత్రి నివాస్) ఒప్పందం మేరకు నాన్ లైన్ అకౌంట్ను ఓపెన్ చేయకపోవడం, టర్నోవర్ రిపోర్టును సమర్పించకపోవడం, లీజును టర్మినెట్ చేయడంతో ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే తరహాలో నిర్లక్ష్యం చేస్తున్న లీజు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో ఎండీ టూరిజం మనోహర్, అధికారులు సత్యనారాయణ, అదిల్ తదితరులు పాల్గొన్నారు.