TSPSC | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం టీఎస్పీఎస్సీ కమిషన్కు ప్రాథమిక నివేదికను అందజేసింది. టీఎస్పీఎస్సీ సైతం అంతర్గతంగా ఈ విషయమై విచారణ చేపట్టింది. అన్నింటినీ పరిశీలించి.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను కమిషన్ రద్దు చేసింది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను ముందస్తు జాగ్రత్తలో భాగంగా వాయిదా వేసింది.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవినీతి జరిగిందని తేలితే.. అందులో బాధ్యులను మాత్రమే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. మిగతా వారందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికాకుండా పరీక్ష మాత్రమే నిర్వహిస్తే.. ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తారు. అందుకే గ్రూప్-1ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది.
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. మొత్తం 19 విభాగాలకు 3,80,204 మంది దరఖాస్తు చేయగా, 3.42 లక్షల మంది హల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అందులో నుంచి 25,050 మంది మెయిన్స్కు ఎంపికైనట్టు టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. అయితే లీకేజీ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ శుక్రవారం ప్రాథమిక నివేదికను టీఎస్పీఎస్సీకి అందించింది. నివేదికపై విస్తృతంగా చర్చించిన టీఎస్పీఎస్సీ కమిషన్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ జూన్ 11వ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, దీనికోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదని, గతంలో దరఖాస్తు చేసుకున్న 3,80,204 మంది పరీక్షకు అర్హులేనని కమిషన్ తెలిపింది.
తెలంగాణలో వివిధ క్యాటగిరీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాలకు జనవరి 22న టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. మొత్తం 1,540 ఏఈఈ ఉద్యోగాలకు 81,571 మంది దరఖాస్తు చేయగా, 61,452 మంది హాజరయ్యారు. అదేవిధంగా, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(వర్క్స్) గ్రేడ్-2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 26 పరీక్ష జరిగింది. 1,06,253 మంది దరఖాస్తు చేయగా, 67,830 పరీక్షకు హాజరయ్యారు.
833 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షకు మార్చి 5వ తేదీ పరీక్ష జరిగింది. 74,478 మంది దరఖాస్తు చేయగా, 55,189 మంది పరీక్ష రాశారు. టీపీబీవో, వెటర్నరీ అసిస్టంట్ సర్జన్ ఉద్యోగాలకు ఈ నెల 15, 16వ తేదీ ఎగ్జామ్ జరగాల్సి ఉండగా, ముందుగానే పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలన్నింటికీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ ఉండబోదని, గతంలో దరఖాస్తు చేసుకున్నవారందరూ మళ్లీ పరీక్షకు హాజరుకావచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. కాగా, ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) విధానంలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు మాత్రమే హ్యాకింగ్కు గురైన కంప్యూటర్లో ఉన్నట్టు తెలిసింది. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలేవీ ఆ కంప్యూటర్లో లేవు. దాంతో ఓఎంఆర్ పద్ధతిలో జరిగిన పరీక్షలను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. సీబీటీ పద్ధతిలో జరిగిన పరీక్షలను రద్దు చేయలేదు. రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ పేర్కొన్నది.
టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించి పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీలో జరిగిన లీకేజీ వ్యవహారంలో ప్రజాందోళనలను గౌరవించి ప్రభుత్వం వెంటనే స్పందించడం మంచిపరిణామమని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇతర నియామక పరీక్షల లీకేజీపై అనుమానాలుంటే లోతుగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.