హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదల గులాబీల్లో నెలకొన్న దృశ్యాలు ఆత్మీయ సమ్మేళనాల్లో దర్శనమిస్తున్నాయి. వచ్చేనెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో గురువారం పలు నియోజకవర్గాల్లో సమ్మేళనాలు జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఒక్కచోట చేరి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని ఆత్మీయ సమ్మేళనాల్లో గులాబీ దండు తేల్చిచెబుతున్నది. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని మంత్రులు, పార్టీ నాయకులు శ్రేణులకు సూచించారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నేతృత్వంలో నియోజక వర్గంలోని నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా ఇంచార్జి వీ గంగాధర్గౌడ్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ధర్మ పాలన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్సీ కవితపై అక్రమంగా కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తున్నది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు మంత్రి కేటీఆర్కు అంటగట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి వివరించాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఉల్టా ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
– అంజిలయ్య, రిటైర్డ్ టీచర్, హకీంపేట, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా