MLC Kavitha | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని, న్యాయ చరిత్రలో చీకటి దినం అని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో..శనివారం ఈడీ అధికారులు కవితను హాజరుపరిచారు. జస్టిస్ నాగ్పాల్ ధర్మాసనం ముందు జరిగిన విచారణలో కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని సైతం ఉల్లంఘించిందని చెప్పారు. కవిత నిరుడు మార్చి 11న, 20న, 21న ఈడీ విచారణకు హాజరయ్యారని గుర్తుచేశారు. ఆ సమయంలోనే మహిళలను ఈడీ విచారించే అంశంపై నళినీ చిదంబరం దాఖలు చేసిన కేసులో కవిత ఇంప్లీడ్ అయ్యారని గుర్తు చేశారు. ఈడీ ఇచ్చిన సమన్లు, నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసునే కొట్టివేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో గత ఏడాది మార్చి 15 నుంచి విచారణ జరుగుతున్నదని వివరించారు. గత సెప్టెంబర్ 15న విచారణ సమయంలో.. ఈడీ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ ‘తదుపరి విచారణ వరకు కవితకు సమన్లు జారీ చేయము, అరెస్ట్ చేయబోము’ అని ధర్మాసనానికి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీనిని దేశం మొత్తం చూసిందని అన్నారు. ఈ పిటిషన్ఫై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యి కేసు వాయిదా పడిందని చెప్పారు.
ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తెలంగాణలో కవిత నివాసంలో సోదాలు నిర్వహించారని, సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఈడీ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, సర్వోన్నత న్యాయస్థానాన్ని వెక్కిరించిందని విమర్శించారు. కవితను సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేశారని చెప్పారు. అరెస్ట్ ఆర్డర్లో నమోదు చేసిన సమయాన్ని తప్పుబట్టారు. అధికారులు సాయం త్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు అందులో పేర్కొన్నారని, కానీ పంచనామాలో 6:45 గంటలకు సోదాలు ముగిశాయని తెలిపారు. ఒకవేళ 5:20 గంటలకే అరెస్ట్ పూర్తయితే.. మరో గంటకుపైగా సోదాలు ఎందుకు కొనసాగించారని ప్రశ్నించారు. సాయంత్రం 6:26 గంటలకే సూర్యాస్తమయం అయ్యిందని తెలిపారు. ‘కవితను అరెస్ట్ చేయాలని ఎవరు నిర్ణయించారు?. మరో మూడు రోజులు ఎదురుచూసి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అరెస్ట్ చేయాలనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాలన్న కనీస మర్యాద పాటించలేదు. మీరే (ఈడీ) న్యాయమూర్తిగా, ధర్మాసనంగా, తలారిగా వ్యవహరించారు. ఇది తప్పు కాదా?’ అని నిలదీశారు. మా విచారణకు రాకుండా కోర్టుకు వెళ్తారా.. ఎంత ధైర్యం అనే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని అన్నా రు. వారు రాతల్లో ఒకటి, మనసులో మరొకటి, చేతల్లో ఇంకొకటి చూపుతున్నారని విమర్శించారు.
సాక్షినా.. నిందితురాలినా?
ఇదే కేసులో సీబీఐ కవితను సాక్షిగా నమోదు చేసి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిందని విక్రమ్చౌదరి గుర్తు చేశారు. 2022 డిసెంబర్లో అధికారులు ఆమె ఇంటికి వెళ్లి విచారించారని తెలిపారు. ‘సీబీఐ సాక్షి అంటున్నది.. ఈడీ నిందితురాలు అంటున్నది.. ఏది నిజం?’ అని ప్రశ్నించారు. ఒక మహిళను అరెస్టు చేసి, 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం తీసుకెళ్లాలంటే తప్పకుండా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలని, కానీ అలాంటిదేమీ లేకుండా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారని వివరించారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. మధ్యంతర ఉత్తర్వులు ఉండగా.. దర్యాప్తునకు ఆమె పూర్తిగా సహకరిస్తుండగా.. ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో కవితకు అన్ని విధాలా రిలీఫ్ ఇచ్చిందని గుర్తుచేశారు. కవిత పిటిషన్పై ఈనెల 19వ తేదీన సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరుగనున్నదని, అప్పటి వరకు ఈడీ కోర్టులోని కేసు విచారణను నిలుపుదల చేయాలని, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
మా హామీ 10 రోజుల వరకు మాత్రమే..
ఈడీ తరపున స్పెషల్ కౌన్సిల్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. కవితపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టు సహా ఏ న్యాయస్థానానికీ ఈడీ హామీ ఇవ్వలేదని చెప్పారు. కవితకు సమన్లు ఇవ్వబోమని సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఇచ్చిన హామీ.. తదుపరి విచారణ వరకు మాత్రమేనని అన్నారు. అంతేతప్ప విచారణ మొత్తం ముగిసేవరకు కాదని తెలిపారు. 10 రోజుల తర్వాత ఆ హామీ గడువు ముగిసిందని చెప్పారు. ఆ తర్వాత కవితకు సమన్లు జారీ చేశామని, కానీ.. వాటిని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించలేదని తెలిపారు. కవితపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్వర్వులు ఏమీ రాలేదని చెప్పారు. వారు చెప్తున్నవి కవిత దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించినవి కాదని, నలినీ చిదంబరం పిటిషన్లో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కవిత అన్వయించుకుంటున్నారని తెలిపారు. కవిత వేసిన ఇంప్లీడ్ పిటిషన్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఇతర వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటనలో కవిత పాత్ర ఉన్నదని ఈడీ నమ్ముతున్నదని తెలిపారు. కవిత రిమాండ్ రిపోర్ట్లో ఆమెను అరెస్ట్ చేయడానికి గల కారణాలన్నింటినీ పొందుపరిచామని తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేశారన్న వాదనలను సైతం ఖండించారు. సోదాల సమయంలో సోదరుడినని, బంధువులమని కొందరు వచ్చి అడ్డగించడం వల్ల ఆలస్యం అయ్యిందని అన్నారు. అరెస్ట్ చేసినవారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచలేకపోతే మాత్రమే ట్రాన్సిట్ రిమాండ్ అవసరమని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం కవితకు వారం రోజుల కస్టడీ విధిస్తూ జస్టిస్ ఎంకే నాగపాల్ తీర్పు వెలువరించారు.
ఈడీ సమాచారమ్విలేదు
కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించిన అధికారులు.. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వాదనలు ప్రారంభం కాగానే ఈడీ తమకు సరైన సమాచారం ఇవ్వలేదని విక్రమ్ చౌదరి పేర్కొన్నారు. ఆమెను న్యాయవాదితో కనీసం మాట్లాడనీయలేదని చెప్పారు. కాబట్టి కవితతో ఐదు నిముషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి అనుమతించారు. కవిత భర్త అనిల్, మాజీ ఏఏజీ రామచంద్రరావు, న్యాయవాది మోహిత్రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు సైతం కోర్టుకు వెళ్లారు.
కేసీఆర్ను ఎదుర్కోలేక కవితను అరెస్టు చేశారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీయడానికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఈడీ అధికారులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంటలకు మహిళలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. కోర్టులపై విశ్వాసం ఉంది. కవిత కేసులో న్యాయం గెలుస్తుంది.
-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కవిత అరెస్టు ముమ్మాటికీ కుట్రలో భాగమే
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో కవితను సాక్షిగా విచారిస్తున్న ఈడీ.. ఒక మహిళ హక్కులను హరించేలా అరెస్ట్ చేసింది. ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పి ప్రభుత్వాలను కూలగొడుతూ, దాడులు చేయిస్తూ.. కేసులలో ఇరికిస్తున్న ప్రధాని దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి.
-స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అరెస్టు రాజకీయ కుట్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనలేక నరేంద్ర మోదీ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులకు తెరలేపారు. వేల కోట్లు దోచుకుని దేశం విడిచి వెళ్లిపోతున్న వారిని వదిలిపెట్టి, కేసులో సాక్షిగా పిలిచిన ఆడబిడ్డను నిందితురాలిగా చేర్చి అరెస్టు చేయడం అక్రమం. సుప్రీం కోర్టులో ఈ నెల 19న వాదనలు ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ ఒక రోజు ముందు హడావుడిగా అరెస్టు చేయడం రాజకీయ కుట్రే. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది.
– ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి
చూస్తూ ఊరుకోం..
తెలంగాణ అస్థిత్వ పునాదులపై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసేందుకే కవితక్కను అరెస్టు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తూ అణిచివేయాలని చూస్తే.. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు జైలు గోడలు కొత్తకాదు. కవితక్క కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది. తెలంగాణ ఆడబిడ్డ కవితక్క అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్