హైదరాబాద్, ఫిబ్రవరి 18, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకున్నది. న్యాయవాది పసునూరు వేణుగోపాలరావు తన కేసులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హాలులో ఉన్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఇతర న్యాయవాదులు ఆయన్ని వెంటనే పైకిలేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆయనను హుటాహుటిన అంబులెన్స్లో ఉస్మానియా దవాఖానకు తరలించారు. అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని హిల్కాలనీలో వేణుగోపాలరావు నివాసం ఉంటున్నారు. అప్పటివరకు తమతో ఉన్న న్యాయవాది మరణించడంతో న్యాయవాదులు, బెంచ్పై ఉన్న న్యాయమూర్తి నిర్ఘాంతపోయారు. ఈ ఘటన అనంతరం కేసుల విచారణను ముగించి న్యాయమూర్తి బెంచ్దిగి వెళ్లిపోయారు. న్యాయవాది ఆకస్మిక మరణ వార్త తెలియగానే ఇతర కోర్టులు కూడా అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశాయి. న్యాయవాది వేణుగోపాలరావు ఒక కేసు విచారణ సమయంలో 21వ కోర్టు హాలులో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తున్నారు.