ఖిల్లాఘణపురం, ఆగస్టు 24: తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం మండలంలోని ఆముదంబండతండాలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తండావాసులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఎనిమిదేండ్లుగా పల్లెనిద్ర కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆముదంబండతండాలో రైతుబంధు పథకం కింద 185 మంది రైతులకు రూ. 25లక్షల51వేలు జమ చేశామన్నారు. నలుగురికి రైతుబీమా పథకం ద్వారా రూ.20లక్షలు, 27మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 27మందికి కేసీఆర్ కిట్, రూ.32లక్షలతో మిషన్భగీరథ ద్వారా తాగునీరు, రూ.7లక్షలతో మిషన్ కాకతీయ పథకంలో చెరువుల మరమ్మతులు, గ్రామానికి బీటీరోడ్డు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రచారానికి ముంబైకి వెళ్తే 4వేల మంది గిరిజనులు సమావేశానికి వచ్చారని, వీరంతా మన జిల్లాలో సాగునీరు లేకనే అక్కడికి బతుకుదెరువుకు వెళ్లినట్లు తెలిపారని గుర్తు చేశారు. ఇటీవల తిరిగి ముంబై వెళ్లినప్పుడు సమావేశానికి 1500 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. సాగునీటి రాకతో వివిధ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వారు తిరిగి గ్రామానికి చేరుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.