Telangana | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అదేవిధంగా సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి కూడా మరోసారి క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది. పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో 58, జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని సైతం 2020 జూన్ 2 వరకు పొడిగించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం జీవో నంబర్ 28, 29 జారీ చేసింది. పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇవ్వగా, సింగరేణి పరిధిలో దరఖాస్తులకు 3 నెలలు అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జీవో 58, 59 కింద పట్టణ పేదలకు మరోసారి అవకాశం కల్పించాలని, కటాఫ్ తేదీని పొడిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. శుక్రవారం కోడ్ ఎత్తివేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) భూములు ఆక్రమించుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రం ఏర్పడే నాటికి (2014 జూన్ 2) పట్టణాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2014 డిసెంబర్ 30వ తేదీన జీవో 58, 59ను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన ప్రభుత్వం.. గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. సింగరేణి పరిధిలోనూ జీవో 58, 59 కింద 2014లో ఒకసారి, 2019లో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించారు. ఇలా ఇప్పటివరకు జీవో 58 కింద 1,45,668 మంది పట్టాలు పొందారు. జీవో 59 కింద 42 వేల మందికి వారి ఇండ్లపై హక్కులు సంక్రమించాయి. తాజాగా పేదలకు మరోసారి దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని ఆరేండ్లు పొడిగించింది. 2014 జూన్ 2 నుంచి 2020 జూన్ 2వ తేదీకి మార్చింది. ఈ నిర్ణయంతో లక్షల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలగనున్నది. గతంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు పెద్దఎత్తున అవినీతి జరిగేది. స్థానిక నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు అడిగేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు తీసుకొని, వాటిని పరిశీలించి, పట్టాలు మంజూరు చేస్తున్నది.
క్రమబద్ధీకరణకు కొత్త కటాఫ్ తేదీ .. 02-06-2020
పట్టణాల్లో దరఖాస్తుల గడువు.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు
సింగరేణి పరిధిలో.. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు