Khanamet | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమాంతం మింగేస్తూ, మరోవైపు విలువైన ప్రైవేట్ భూములనూ చెరబడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలువైన భూములు ఎక్కడ కనిపించినా రౌడీలు, బౌన్సర్లను దింపి బెదిరింపులకు దిగుతున్నారు. వారికి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేతల అండదండలు ఉండటంతో అధికారులు, పోలీసులు సైతం వారికి సహకరిస్తున్నారు. దీంతో సామాన్యుడి భూములకు రక్షణ లేకుండా పోతున్నది. ఈ క్రమంలో తాజాగా ఖానామెట్లో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ పరిధిలోని ఖానామెట్లో రూ.50 కోట్ల విలువైన 1,400 గజాల భూమిని అక్రమార్కులు కబ్జా చేసి, దాదాపు రెండు వారాలుగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అడిగితే తమ వెనుక ‘పెద్ద సార్’ ఉన్నారని చెప్తున్నారని, బౌన్సర్లు, రౌడీ మూకలను పంపించి బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధికారం, పలుకుబడితో అరాచకం
ఖానామెట్ యశోద హాస్పిటల్ పక్కన సర్వే నంబర్ 41/11లో ఐదుగురు వ్యక్తులకు చెందిన 1,400 చదరపు గజాల స్థలం ఉన్నది. ఐదుగురి పేరుమీద పదిహేనేండ్ల నుంచి రిజిస్ట్రేషన్, సేల్డీడ్ ఉన్నాయి. గతంలో ఈ భూమిపై వివాదం నెలకొనగా, కూకట్పల్లి సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. దాని పక్కనే సయ్యద్ మక్బూల్కు కొంత భూమి ఉన్నది. ఆ భూమితోపాటు సర్వే నంబర్ 41/11లోని భూమి కూడా తనదేనని, ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరించినట్టు ఫ్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు.
ఒకరోజు రాత్రి మక్బూల్ తనతోపాటు గొట్టిముక్కల గోపాలకృష్ణ వర్మ, పల్లపు గోవర్ధన్, రవినాయక్ అనే వ్యక్తులను, మరికొంత మంది గూండాలను తీసుకొచ్చి స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, రేకులను తొలగించారని తెలిపారు. మక్బూల్ తండ్రి పేరిట ‘రసూల్ సన్స్’ అని పేరు రాశారని, ఆ భూమి తమదేనని చెప్పుకొంటున్నారని చెప్పారు. ఇలా గత రెండు వారాలుగా పదుల సంఖ్యలో గూండాలతో ఆ భూమిలోనే తిష్టవేసి అరాచకాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, తమ వెనుక ‘పెద్ద సార్’ ఉన్నారని, ఎక్కువ చేస్తే ఆయనే వస్తారని, పోలీసులు, అధికారులకు చెప్పుకొన్నా కూడా ఏమీ జరుగదంటూ తీవ్ర పదజాలంతో బెదిరించారని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని పోలీసులు, అధికారులు
కబ్జాదారులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే జీహెచ్ఎంసీ అధికారులకు కైంప్లెంట్ ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల వద్దకు వెళ్తే ఈ వ్యవహారంలో పెద్దవాళ్లు ఉన్నారని, భూమి ఖాళీ చేయడమే మంచిదని సలహా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగడంతో చివరకు మక్బూల్, గోపాలకృష్ణ వర్మ, పల్లపు గోవర్ధన్, రవినాయక్పై కేసు నమోదు చేశారని తెలిపారు.
వారం రోజులు దాటుతున్నా ఇప్పటివరకు దర్యాప్తు చేయలేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కేసు నమోదైనా మళ్లీ తమ స్థలం వద్దకు ప్రతి రాత్రి 50 మందికి పైగా గూండాలను తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా తమను ఏం చేయలేరని, తమ వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, భూమిని అప్పగించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిందితుడు గోపాలకృష్ణ వర్మపై గతంలోనూ భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదైనట్టు సమాచారం.