హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కిరికిరి జాగల వేలంపాటలపై సర్కార్ డైలామాలో పడింది. టైటిల్ రహిత భూములను వ్యాపారులకు కట్టబెట్టే ప్రయత్నంలో అభాసుపాలైన నేపథ్యంలో… ఈ వేలం ప్రక్రియను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నది. షేక్పేట మండల పరిధిలోని హకీంపేట గ్రామ సర్వే నంబర్లోని 102/1లో గల 8.24 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఎకరాకు కనీస ధరను రూ.99 కోట్లుగా నిర్ధారించిన హెచ్ఎండీఏ, దీనికోసం శుక్రవారం ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి, ఈ నెల 19వ తేదీన భూములు వేలం వేసేందుకు సన్నాహాలు చేసింది.
అయితే, పరిపాలన కారణాల పేరిట వివాదాన్ని తప్పించేందుకు ప్రీబిడ్, వేలంపాట షెడ్యూల్ను జూలై 2వ తేదీకి మార్చివేసింది. అయితే, ఈ భూముల్లో తమకు వాటా ఉన్నదంటూ యమునా నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీతోపాటు నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగడంతో… భూముల వేలం విషయంలో సరిహద్దులు తేల్చి, టైటిల్ వివాదం సద్దుమణిగే వరకు వేలం ప్రక్రియను నిలిపివేశారు. స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో వేలం నుంచి వెనక్కి తగ్గింది.
మేడిపల్లి భూముల వేలంపై హెచ్ఎండీఏ పునరాలోచన చేస్తున్నదని తెలుస్తున్నది. ఒకసారి వేలం వేసిన భూములను ఎలా నిషేధిత జాబితాలో చేర్చారంటూ హెచ్ఎండీఏ వర్గాలు ఆరా తీశాయి. అయితే, గతంలో ప్రభుత్వ భూములని భావించి, జిల్లా యంత్రాంగం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు జారీ చేసిన ఆదేశాలతో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారం హెచ్ఎండీఏ దృష్టికి రావడంతో… దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. కానీ, రెవెన్యూ విభాగం నుంచి స్పష్టత వచ్చేంత వరకు మేడిపల్లి హెచ్ఎండీఏ వెంచర్లోని 68 ప్లాట్లను కూడా వేలం వేయకపోవడమే మంచిదనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు.
కానీ, సర్కార్ మాత్రం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి, నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లకు భూముల వేలం నిర్వహించాల్సిందేనని ఆదేశించినట్టు సమాచారం. కానీ, నిషేధిత జాబితాలో ఉంటే కొనుగోలుదారులెవరూ ముందుకు రారనే విషయాన్ని సర్కార్ పట్టించుకొనే దశలో లేదని అధికారులు చర్చించుకొంటున్నారు. ఇప్పుడున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా వివాదాస్పద భూములనైనా కట్టబెట్టి సొమ్ము చేసుకోవాల్సిందేనని స్పష్టంచేసినట్టు సమాచారం.