సూర్యాపేట: ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం (Kaleshwaram) నుంచి గోదావరి (Godavari) జలాలను తరలించినందుకుగాను.. నేడు లక్ష మందితో హారతులు (Laksha Jana Harathi) ఇవ్వనున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade celebrations) భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాగు నీటి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో కాళేశ్వరం జలాలు పారుతున్న 68 కిలోమీటర్ల మేర మధ్యాహ్నం 12 గంటలకు లక్ష మందితో జన హారతి ఇవ్వనున్నారు. దీనికోసం రైతులు, మహిళలు, పెద్దలు, పిల్లలు సిద్ధమయ్యారు.
కాళేశ్వరం కాలువల వెంబడి వంటావార్పు నిర్వహించనున్నారు. దీంతో నాగరం, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రూరల్, ఆత్మకూర్ ఎస్, చివ్వేంల,పెన్ పహాడ్, మోతె మండలాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా వైద్య శాఖ ప్రతిచోట వైద్యబృందాలను ఏర్పాటుచేశారు.
సూర్యాపేట జిల్లాలో కాకతీయుల కాలం నుంచి వ్యవసాయం అద్భుతంగా ఉండగా, గత 60 ఏండ్ల సమైక్య పాలనలో ఏటికేడు వ్యవసాయం కునారిల్లింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోని బావుల్లో బకెట్లతో నీళ్లు అందుకోగా, ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన దుస్థితి. ఫలితంగా ఉపాధి కోసం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలు పట్నం బాటన వలస పట్టారు. ఐదు దశాబ్దాల పాటు ఊరించిన ఎస్ఆర్ఎస్పీ జలాలు కలగానే మిగిలాయి. నీళ్లిచ్చే ఉద్దేశం లేకపోయినా ఎన్నికల కోసం, కమీషన్ల కోసం తీసిన కాల్వలు ఏండ్లకేండ్లు వెక్కిరించాయి. 1972 నుంచి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తెస్తామంటూ హామీలు ఇచ్చి కాల్వలు తవ్వడం ప్రారంభిస్తే 2018 వరకు నీటి జాడ లేదు.
గతంలో ఓ నాయకుడు నీళ్లు తెస్తానంటూ శంకుస్థాపన చేస్తే, దోతి కట్టుకొని వచ్చిన మరో నాయకుడు మొక్కలు నాటాడు తప్ప సూర్యాపేటకు సాగునీటిని ఇవ్వలేదు. 350 కిలోమీటర్లపైనే బయల్దేరిన 6వేల క్యూసెక్కుల నీళ్లను కాకతీయ కాల్వల ద్వారా ఇక్కడికి తేలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. నేడు ఆ నీళ్లే సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చివరి ఆయకట్టు పెన్పహాడ్ మండలం రావిచెరువుకు నీళ్లు అందుతున్నాయి.