హైదరాబాద్ : పది రోజుల పాటు లక్నవరం సందర్శనను నిలిపివేసినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ఎండీ బీ మనోహర్రావు తెలిపారు. స్థానికంగా ఉన్న హరిత కాటేజీలు, హోటళ్లు అన్ని కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారని, ఇప్పటికే కాటేజీలు బుక్ చేసుకున్న వారు వెళ్లొచ్చని.. మిగతా అనుమతి ఉండదని తెలిపారు. మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర నేపథ్యంలో భారీగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈ నెల రోజుల నుంచి మేడారం దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి పెరగడంతో లక్నవరం సందర్శనకు వచ్చే సందర్శకుల సంఖ్య సైతం పెరిగింది. అంతకుముందు రోజూ 1,500 నుంచి 2వేల మంది వస్తే, ప్రస్తుతం 4వేల నుంచి 5వేలమంది వస్తున్నారు. వారంతాలో 8వేల నుంచి 10వేల వరకు వస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు సైతం లక్నవరం సందర్శకు వస్తే పర్యాటక ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా.. నిర్వహణ, వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
లక్నవరంతో పాటు రామప్ప ఆలయ దర్శనాన్ని పది రోజుల పాటు నిలిపివేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు లేఖ రాశారు. అయితే, రామప్పకు ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సందర్శకులను అనుమతించకపోవడం సరికాదని ఆర్కియాలజీ అధికారులు భావిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి జాతరకు వచ్చి రామప్పను చూడాలనుకునే వారిని నిరాశపరచడం సరికాదంటున్నారు.
ఈ విషయంపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డీజీకి లేఖ రాశామని, ఆయన ఆదేశాల మేరకు భక్తులను అనుమతించేది.. లేనిది తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. పార్కింగ్కు చుట్టపక్కల కావాల్సినంత స్థలం అందుబాటులో ఉందని, ఇబ్బందులు లేకుండా భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తుది నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని అప్పటి వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు.