గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాం
ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్
హనుమకొండ, జూలై 1: కాకతీయులు నిర్మించిన కట్టడాలు, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం ఆయన చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి హనుమకొండ పద్మాక్షికాలనీలోని అగ్గలయ్య గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాల గుడిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేయగా, కాకతీయల కట్టడాలకు సైతం పూర్వవైభవం తీసుకొస్తున్నామని తెలిపారు.
మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని స్పష్టంచేశారు.ఓరుగల్లులోనే కాకుండా తెలంగాణలో కాకతీయులు నిర్మించిన త్రికూట దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని, వీటిని తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం మాట్లాడుతూ.. 700 ఏండ్ల తర్వాత కాకతీయుల 22వ వారసుడు, ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్దేవ్ కాకతీయ ఈ ఉత్సవాలకు హాజరవుతున్నట్టు తెలిపారు. వారి తాత ముత్తాతలు నడియాడిన నేల విశిష్టతను వారికి వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాకతీయుల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్తామన్నారు. రెండు మూడు రోజుల్లో కార్యక్రమాల పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.