KTR | హైదరాబాద్ : లగచర్ల భూసేకరణ బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిసి వివరించారు. కేటీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ వారితో చెప్పారు.
ప్రభుత్వం గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల ద్వారా బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలని, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం తగదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీతో టెలిఫోన్లో మాట్లాడిన కేటీఆర్, బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు.
లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్ రద్దు చేసుకుందన్నారు. కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలన్నారు.
గిరిజన భూములను వదిలి, రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరణ చేసి పరిశ్రమల కోసం ఉపయోగించాలన్న కేటీఆర్, గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వంటి వారి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల తరఫున, భారత రాష్ట్ర సమితి న్యాయపోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది : హరీశ్రావు
KCR | 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్కు ఆహ్వానం
Rasamai Balakishan | రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై రసమయి బాలకిషన్ పాట.. వీడియో