సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో 14గేట్లు ఎత్తి, వరదనీరు కిందకు..
అక్టోబర్ 28 వరకూ నీటివిడుదల
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
కందకుర్తి త్రివేణి సంగమానికి జలకళ
మెండోరా/రెంజల్, జూలై 1 : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణలో గురువారం ఎత్తి దిగువకు నీటివిడుదల చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి కేంద్ర జల వనరుల సంఘం అధికారులు బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు ఉదయం నుంచి నీటివిడుదల చేశారు. తిరిగి అక్టోబర్ 28 తేదీన గేట్లు మూసివేస్తారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 0.93 టీఎంసీల నీరు ఉంది. విడుదల చేసిన వరదనీరు 80 కిలోమీటర్లు ప్రయాణించి గురువారం రాత్రి వరకు ఎస్సారెస్పీకి చేరుకుంటుందని ఎస్సారెస్పీ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈఎన్ శ్రీనివాస్రావు, నాందెడ్ ఈఈ ఎన్పీ గవానే, డీఈ నరేశ్, ఏఈఈ వంశీ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 1న తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీలోకి విడుదల చేస్తారు.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 4,351క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నది. మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1069.20 అడుగులు (27.360 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది.
నిండుగా పారుతున్న త్రివేణి సంగమ క్షేత్రం
బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలోకి నీరుచేరుతున్నది. నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు బాబ్లీ నుంచి నీటి విడుదల చేసే గంట ముందు సైరన్ మోగించి అనంతరం దిగువకు నీటి వదిలేశారు. నదిలో గల పురాతన శివాలయం పక్కనే జ్యోతిర్లింగాలు నీట మునిగాయి.