Wine Shops | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. జిల్లాలోని 294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామంతో అబ్కారీ శాఖ అధికారులు అవాక్కవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ను గత నెల 25న జారీ చేసింది. జిల్లాల వారీగా గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 మద్యం దుకాణాలకు సంబంధించి మాత్రం టెండర్లకు స్పందన కరవైంది. కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వరంగల్ జిల్లాలో 57 షాపులకు కేవలం 3 దరఖాస్తులు వచ్చాయి. హన్మకొండ జిల్లాలో 67 షాపులకుగానూ ఒకటి, జనగామ జిల్లాలో 50 షాపులకుగానూ 2, మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
వైన్షాపు టెండర్లకు సంబంధించి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్ షాపులకు రెండేళ్ల గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ముందుగానే అంటే డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు షాపుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది.
గత కేసీఆర్ ప్రభుత్వం మద్యం షాపులకు రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. గౌడ్స్కు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం షాపులు కేటాయించనున్నారు.
మద్యం షాపుల టెండర్ ఫీజును రాష్ట్ర ప్ర భుత్వం రూ. లక్ష పెంచింది. ఇంతకుముందు రూ. 2 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. రెండేళ్లకు ప్రభుత్వానికి చెల్లించే పన్నుల వివరాలను వెల్లడించింది. 5వేల జనాభా ఉన్న షాపులకు రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలుంటే రూ. 55 లక్షలు, లక్షలోపుంటే రూ. 60 లక్షలు, 5 లక్షలలోపు జనాభా ఉన్న దుకాణాలకు రూ. 65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షలుంటే రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైన జనాభా ఉన్న షాపులకు రూ.1.10 కోట్లు ఆరు దఫాల్లో చెల్లించాలని పేర్కొంది.