హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రణాళికా లోపం హైదరాబాదీలకు నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నది. కృష్ణాజలాల వినియోగంలో ముందస్తు వ్యూహం లేకపోవడం, అవకాశమున్నా కాళేశ్వర జలాలను ఎత్తిపోయకుండా మొండికేయడం వల్ల మహానగరానికి మంచినీటి గండం పొంచి ఉన్నది. నీటిమట్టాలు పడిపోయినా అత్యవసర మోటార్ల ద్వారా ఎత్తిపోస్తామని జలమండలి అధికారులు చెప్తున్నా.. అనేక సవాళ్లు మోకాలడ్డేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కృష్ణాజలాల వినియోగంలో తెలంగాణ నీటి కోటా పూర్తవడంతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు కరుణిస్తే తప్ప నాగార్జునసాగర్ నుంచి నగరానికి కృష్ణాజలాల సరఫరా సాఫీగా కొనసాగే అవకాశాలు లేవు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ సర్కారు మొండికేయడంతో ఎల్లంపల్లిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
నీటికోటా లేకుండా ఎత్తిపోత ఎలా?
ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నందున అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్కారు చేతులు కాలాక… అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కృష్ణాజలాల వినియోగంపై గత ఏడాది అక్టోబర్లోనే జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నాగార్జునసాగర్లో 510 అడుగుల కంటే నీటిమట్టం పడిపోతే హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుంది.
అయినా నీటి లభ్యత తక్కువగా ఉండటంతో 505 అడుగుల వరకు ఉన్న నీటిని లెక్కించి తెలంగాణకు 39.743 టీఎంసీల కోటాను కృష్ణా బోర్డు కేటాయించింది. నగరానికి జలమండలి అందిస్తున్న మంచినీటి సరఫరాలో ఏకంగా 48 శాతం వరకు ఉన్న కృష్ణాజలాలను దృష్టిలో ఉంచుకొని అటు శ్రీశైలం, ఇటు సాగర్లో నీటి వినియోగాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రభుత్వం అవేవీ పట్టించుకోకపోవడంతో కోటా వాడకం పూర్తవడంతోపాటు అదనంగా 4.743 టీఎంసీలు అదనంగా వాడుకున్నారని కేఆర్బీఎం తేల్చింది.
రాను న్న 4 నెలల వరకు హైదరాబాద్ నీటి సరఫరా కోసం ఆరు టీఎంసీలు కావాలని జలమండలి చెప్తున్నది. నీటిమట్టం పడిపోతే అత్యవసర మోటార్లు కూడా ఏర్పాటు చేస్తామని రంగం సిద్ధం చేసుకున్నది. కానీ, అసలు నీటి కోటా లేకుండా జలాల ఎత్తిపోత ఎలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మానవతా దృక్పథంతో స్పందించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు అనుమతులు ఇస్తుందని అధికార యంత్రాం గం ఆశిస్తున్నది. అంటే కేఆర్ఎంబీ దయాదాక్షిణ్యాలపై హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధారపడి ఉన్నదనేది స్పష్టమవుతున్నది. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించి చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభు త్వం.. ఇటు ప్రణాళికాబద్ధంగా నీటిని వాడుకోకపోవడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది.
లెక్క కుదరని ఎల్లంపల్లి…
హైదరాబాద్లో సరఫరా అవుతున్న మంచినీటిలో 30 శాతం (రోజుకు 172 మిలియన గ్యాలన్లు) గోదావరి జలాలే. ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి ఈ నీటిని సరఫరా చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండు వేసవిలోనూ ఎల్లంపల్లిలో నీటి నిల్వలు పుష్కలంగా ఉండేవి. కానీ, మేడిగడ్డ లోపాన్ని సాకుగా చూపి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇన్ఫ్లో వస్తున్నా ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు. ఇప్పటికీ అక్కడ రెండు మోటార్లు నడిపేంత ఇన్ఫ్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎల్లంపల్లి జలాశయం అడుగంటిపోతున్నది. ప్రస్తుతం అందులో 8.83 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది డెడ్స్టోరేజీ కింద 3.3 టీఎంసీలు పోగా లభ్యత 5.5 టీఎంసీలుగా ఉన్నది. వచ్చే నాలుగు నెలల హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 3.60 టీఎంసీలు కావాలని జలమండలి అంచనా.
పంటలకు ఎల్లంపల్లి నీళ్లు!
గడ్డు పరిస్థితి ఉంటే.. పులి మీద పుట్రలా! సాగునీటి విడుదలకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారనే సమాచారం మరింత ఆందోళన కలిగించే పరిణామం. వేములవాడ, ధర్మపురి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ సీఎంని కలిసి తమ నియోజకవర్గాల్లో పంటలను కాపాడేందుకు ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కోరగా… ఆయన మంత్రి ఉత్తమ్కు ఆదేశాలిస్తే… మంత్రి చీఫ్ ఇంజినీర్కు ఆదేశాలిచ్చినట్లుగా విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రకటన విడుదల చేశారు. మరి ఇదే నిజమైతే పరిస్థితి మరెంత గందరగోళంగా మారనుందో అర్థం చేసుకోవచ్చు.