హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ది కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఆర్టీసీ సహా అనేక కార్మిక సంఘాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుతున్నాయని, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె చేస్తున్న పని విధానమే ఇందుకు కారణమని వివిధ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ఈటల అనుచిత వ్యాఖ్యలపై నగరంలోని సోమాజిగూడలో గల ప్రెస్ క్లబ్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ గౌరవాధ్యక్షురాలిగా ఉండాలని తామంతా ఎమ్మెల్సీ కవితను కోరామన్నారు. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్ ఆస్తులను కాపాడటానికి 15 రోజులు పాటు కవిత ఢిల్లీలో దీక్ష చేసిన విషయం ఈటలకు తెలియదా అని థామస్ రెడ్డి ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారన్న థామస్ రెడ్డి, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి రూ. 3 వేల కోట్లు కేటాయించారన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, మరి ఈటల రాజేందర్, ఏ ఆత్మగౌరవంతో బీజేపీ లోకి వెళ్తున్నారన్నారు. బీజేపీలో చేరి సింగరేణి, ఆర్టీసీ, ఎల్ఐసీ లాంటి సంస్థలను ఈటల రాజేందర్ ఎలా కాపాడుతారని, బడుగులకు ఏ విధంగా న్యాయం చేస్తారని విమర్శించారు. బీజేపీలో చేరి కేంద్ర రవాణా బిల్లును రద్దు చేయిస్తారా.. ఆర్టీసీని కాపాడుతారా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల నేతగా చెప్పుకుని అక్రమాలకు పాల్పడింది ఈటల రాజేందర్ అన్నారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలో నిజమైన త్యాగాలు చేసింది ఆర్టీసీ కార్మికులేనన్నారు. ఈ సమావేశంలో టీఎంయూ అధ్యక్షులు కమలాకర్ గౌడ్, చీఫ్ అడ్వయిజర్స్ ఎల్.మల్లయ్య, బి.యాదయ్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జీపీఆర్ రెడ్డి, స్టేట్ సెక్రెటరీలు శంకరయ్య, ఎంహెచ్.అలీ పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ పై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలోని 11 రీజియన్లలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేసిన కార్మికులు, కవిత గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత మాత్రమే చరిత్రలో ఎన్నడూలేని విధంగా కార్మికులకు 60కి పైగా హక్కులను సాధించడం జరిగిందని టీబీజీకేఎస్ నాయకులు పేర్కొన్నారు. జాతీయ కార్మిక సంఘాల పెండింగ్లో ఉంచిన డిపెండెంట్లకు మూడు వేల 400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, కారుణ్య నియామకాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, నోటిఫికేషన్ల ద్వారా 4 వేల 500 పైచిలుకు ఉద్యోగాలు, 100 శాతం పవర్ చార్జీల రద్దు, ఉచిత ఏసీ కనెక్షన్లు ఇలా ఎన్నో హక్కులను కవిత సారథ్యంలో సాధించుకున్నట్లు తెలిపారు. 20 ఏండ్లు టీఆర్ఎస్ ద్వారా అనేక పదవులు అనుభవించిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.
తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం ఏర్పాటుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ అన్నారు. ఈటెల రాజేందర్ అన్నట్లుగా తమ సంఘాన్ని ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏర్పాటు చేయలేదని, 2004లో కేసీఆర్ అనుమతితో 2004లో సంఘాన్ని స్థాపించినట్లు స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతో ఉన్న అనుబంధం రీత్యా దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి ఈశ్వర్ లకు తమ సంఘాన్ని చూసే బాధ్యతలు సీఎం కేసీఆర్ అప్పగించారని వెల్లడించారు. ఈటెల తప్పుడు ప్రచారం మానుకుని, వాస్తవాలు మాట్లాడాలని హితువు పలికారు.
కార్మిక సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ఈటల ఎప్పుడు ముందుకు రాలేదని ప్రకాష్ అన్నారు. 2014, 18 లలో టి ఆర్ వి కె ఎస్ సూచనతోనే ప్రభుత్వం పే స్కెల్ పెంచిందన్నారు. కవిత గౌరవాధ్యక్షురాలుగా అయిన తర్వాతనే విద్యుత్ కార్మికుల వేతనాలు పెరిగాయన్నారు. తన ఆస్తులు కాపాడుకునేందుకే ఈటల బీజేపీలోకి వెళ్తున్నాడన్నారు. 2016 నుంచే అవమానాలేదుర్కొంటే ఇన్నాళ్లు పార్టీలో ఎందుకున్నట్లో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ను బద్నాం చేయడానికే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్కు అనుబంధంగా మాత్రమే తమ సంఘం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ రాజలింగం, మునిందర్, రాందాస్, తిరుపతి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.