వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కొడుమూరులోని ఉరుకొండకు చెందిన 30 మంది.. సంగారెడ్డిలో పత్తి ఏరడానికి ట్రాక్టర్లో వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున విలియన్కొండ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ కూలీ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో బైకుపై నుంచి పడి ఓ యువకుడు చనిపోయాడు. వనపర్తి మండల పరిధిలో నాగారం వద్ద బైక్ బోల్తా పడటంతో బన్నీ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.