హైదరాబాద్ : ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న ‘చలో రాజ్ భవన్ ముట్టడి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా గుర్తించిన ప్రజాసమస్యల పరిషారానికి సమరశీల పోరాటాలకు సన్నద్ధమవుతామన్నారు. బీజేపీ తిమింగలంగా మారిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్లోని మగ్ధూం భవన్లో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బలం ఉందో లేదో కూడా తెలయనివారు తామే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కంటే బీజేపీ పెద్ద పార్టీ కాదని, తమకు 119 నియోజవర్గాల్లో సీపీఐ ఉన్నదని, కానీ బీజేపీ ఉన్నదా అని ప్రశ్నించారు. అలాంటి బీజేపీ రాబోయే ప్రభుత్వమే తమదని చెబుతున్నందున ఆ పార్టీకి చెంపపెట్టుగా తాము సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. బీజేపీని వ్యతిరేకించే బలమైన ప్రజాస్వామ్య పార్టీలతో అంశాల ప్రతిపాదికన, ఆయా సందర్భాల్లో కలిసి నడవాలని నిర్ణయించామని, దేశంలో, రాష్ట్రంలో బీజేపీ నిలువరించాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల అవగాహన ప్రస్తుత పద్ధతినే.. భవిష్యత్ కూడా కొనసాగితే ఎన్నికల అవగాహన ఉండే అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకర్గాల్లో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఇందులో 25 బలమైన నియోజకవర్గాలను గుర్తించామన్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, భవిష్యత్ దేనికైనా సంసిద్దంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిషారానికి పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతూనే, మరో వైపు పార్టీని బలోపేతం చేస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.