హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు శుక్రవారం డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులే నిందితులకు కొమ్ముకాస్తున్నారంటూ భారీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మెర ఘటనలో నిందితులను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. పేదలపై దాడులు జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వెనుక ఉన్న శక్తులెవరో తేలాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందని తెలిపారు. బాధితులకు తక్షణమే న్యాయం జరుగకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకంచేసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని, వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మిగిలిన 8 మందిని అరెస్టు చేయాలని కోరారు.
మాకు ప్రాణహాని ఉన్నది : బాధితులు
ఈ ఘటనలో బాధితులు డీజీపీ ఆఫీసు ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. తమకు రక్షణ లేదని వాపోయారు. ‘మా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె తరుకుపోతుంది. మేము పేదవాళ్లం కాబట్టే పోలీసులు మా మొర ఆలకించడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు నేటికీ గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారితో తమకు ప్రాణహాని ఉన్నదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీ కార్యాలయం వద్ద వేడుకున్నారు. మొదట జేఏసీ నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అనంతరం జేఏసీ నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.