(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటుకు గేటు ముంగిటే అన్ని వనరులూ ఉన్నా కేంద్రప్రభుత్వ విధానాలే శనిలా దాపురించాయి. వెనుకబడిన గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్లో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీని సమాధి చేయటంలో కేంద్రంలో పాలన సాగించిన కాంగ్రెస్, ఇప్పుడు ఏలుతున్న బీజేపీ పోటీ పడ్డాయి. ఈ ఫ్యాక్టరీ వందేండ్లు నడవడానికి కావాల్సినంత లైమ్స్టోన్ (సున్నపురాయి) నిల్వలు సంస్థ గడప వద్దే ఉన్నాయి. నీరు, రోడ్డు, రైల్వే మార్గాలు కూడా ఫ్యాక్టరీ గేటుకు సమీపంలోనే ఉన్నాయి. వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించి ఉంటే సీసీఐ అద్భుతంగా నడిచేది. వేల మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి పోయేదికాదు. కానీ మొదటి నుంచీ కేంద్రప్రభుత్వం ఈ ప్లాంటును అమ్మేయాలనే దుర్మార్గ
ఆలోచనతోనే ఒక్కో అడుగు వేస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవకాశాలున్నాయని చెప్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలోని ప్రధాన భాగమైన క్లింకర్ను 1982 ఆగస్టు 15న ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తిని 1984 ఏప్రిల్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్ర మంత్రి ఎన్డీ తివారీ ప్రారంభించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అప్పట్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టారు.
రోజుకు 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (ఏటా 4 లక్షల టన్నులు)తో ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ.. సంస్థకు కొంతకాలం కష్టాలు తప్పలేదు. 1989-90 నుంచి పూర్తిగా లాభాల్లో నడవడం మొదలెట్టింది. దీంతో కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కూడా ఇవ్వడం ప్రారంభించింది. అప్పట్లో సిమెంటు బస్తా ధర రూ.90 లోపే. ప్రభుత్వ నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్ను ప్రభుత్వం కొనుగోలు (లెవీ సిమెంట్) చేస్తుండేది. అప్పటికి ఆదిలాబాద్ యూనిట్లో 500 మంది కార్మికులు, ఉద్యోగులు, 1,500 మందివరకు కాంట్రాక్ట్ కార్మికులు, మరో వెయ్యి మంది ఇతర కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా మరో 5 వేల కుటుంబాలకుపైగా ఉపాధి లభించేది.
లాభాల బాటలో పయనిస్తున్న ఫ్యాక్టరీకి 1991-92లో కేంద్రం ఉన్నట్టుండి నిర్వహణ మూలధనాన్ని ఇవ్వటం నిలిపేసింది. దీంతో సంస్థ మొదటిసారి కుదుపునకు లోనయ్యింది. అప్పటి నుంచి కేంద్రం నిర్ణయాలు, నిర్లక్ష్యం, వివక్షతో ప్లాంట్ను పూర్తిగా మూసివేసే స్థితికి చేరింది. అధికారికంగా 1998 నవంబర్ 5 నుంచి ఉత్పత్తిని నిలిపివేశారు. నిజానికి ఈ ప్లాంటు దీర్ఘకాలం లాభాల్లో నడిచేందుకు అనేక అనుకూలతలున్నాయి. ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల రెండున కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ముందుకువస్తే సహకారం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు.