రాష్ట్రంలో అధికారంలో ఉన్నది నిరుద్యోగుల మేలు కోరే ప్రభుత్వం. మీ ప్రయోజనాల కోసం, ఉపాధి కోసం నిర్విరామంగా పనిచేసే ప్రభుత్వం. మేం మీతో ఉన్నాం. ఆందోళన వద్దు. రాజకీయ నిరుద్యోగులు, బేహారీలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.
ఐటీశాఖ మంత్రి అయితే, రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్కు నేనే బాధ్యుడినా? నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి ఐటీ శాఖ అంటే ఏమిటో తెలుసా? గుజరాత్లో ఎనిమిది పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అక్కడ ఆ శాఖ మంత్రిని బర్తరఫ్ చేశారా? మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణంలో ఏకంగా సీఎం పేరు బయటకు వచ్చింది. అక్కడ సీఎంను బర్తరఫ్ చేశారా?
-మంత్రి కేటీఆర్
రద్దయిన నాలుగు పరీక్షలను వీలైనంత త్వరగా మళ్లీ నిర్వహిస్తాం. అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసిన వారంతా మళ్లీ పరీక్ష రాయొచ్చు. స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతాం. స్టడీసర్కిల్స్లో స్టడీరూమ్స్ను 24 గంటలూ తెరచి ఉంచుతాం. అభ్యర్థులకు అక్కడే ఉచిత భోజన సదుపాయం కల్పిస్తాం.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉన్నట్టు అనుమానిస్తున్నామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అని, సోషల్మీడియాలో ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి చేసిన వ్యాఖ్యలు కూడా కుట్ర కోణానికి బలం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ‘నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వ కుట్ర ఉన్నది. యువత మా పార్టీ వైపు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వంపై నిందలు వేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో లీకేజీ వెనుక కుట్ర కోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. శనివారం టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, సీఎస్ శాంతికుమారితో కలిసి బీఆర్కేఆర్ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారని తెలిపారు. యువతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పేర్కొన్నారు. ఇలా జరగడం తమకు కూడా బాధగా ఉన్నదని, లక్షలాది మంది యువతకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
లీకేజీ ఘటన ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనని, సంస్థ వైఫల్యం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడం దారుణమని పేర్కొన్నారు. ఈ లీకేజీ వెనుక ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు.
రద్దయిన నాలుగు పరీక్షలను వీలైనంత త్వరగా మళ్లీ నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దరఖాస్తు చేసిన వారంతా మళ్లీ పరీక్ష రాయొచ్చని తెలిపారు. అభ్యర్థులపై ఆర్థికభారం పడొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఒక పరీక్ష రద్దయితే అభ్యర్థులు అనుభవించే బాధ తనకు తెలుసని చెప్పారు. కానీ ఒక పరీక్షపై అనుమానాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. ఇది అభ్యర్థులకు కూడా మచ్చగా మిగిలిపోతుందని, అందుకే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థులందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు.
పరీక్షల రద్దుపై అభ్యర్థులు ఆందోళన చెంద వద్దని కేటీఆర్ సూచించారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. స్టడీ సర్కిల్స్లో ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్న స్టడీరూమ్స్ను 24 గంటలపాటు తెరచి ఉంచుతామని తెలిపారు. అభ్యర్థులకు అక్కడే ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ పనిచేస్తుందని, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదిస్తూ చిలువలు పలువలు చేస్తున్నారని మండిపడ్డారు. యువతలో అశాంతి నెలకొల్పేలా, అసహనం పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. రాజకీయ నిరుద్యోగులు, బేహారీలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని యువతకు సూచించారు. ఇక్కడ మీ కోసం పని చేసే ప్రభుత్వం ఉన్నదని, మీ ప్రయోజనాల కోసం, ఉపాధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నదని, ఇలాంటి సమయంలో రాజకీయ నిరుద్యోగుల మాటలను విశ్వసించొద్దని యువతకు సూచించారు.
పేపర్ లీకేజీని రాజకీయాలకు ముడిపెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని, భావోద్వేగాలు రెచ్చగొట్టొదని ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ హితవు చెప్పారు. రాష్ట్రంలో 6-7 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, మంచేదో చెడెదో ప్రజలే చెప్తారని అన్నారు. ఎవరు ఏం చేశారనేది ప్రజలకు బాగా తెలుసని, ఏం చేయాలో వాళ్లే చేస్తారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం సున్నిత మనుస్కులైన పిల్లలను బలి చేయొద్దని కోరారు. యువతలో లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టించొద్దని కోరారు. రాష్ట్రంలో 2.38 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. కేంద్రం మాత్రం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని 16 లక్షల ఖాళీలను భర్తీ చేయడంలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఏమైందని ప్రశ్నించారు. సరిగా పనిచేయడం చేతగాని వాళ్లు.. ఇక్కడికి వచ్చి తమకు నీతులు చెప్పొద్దని హితవు పలికారు. ఇక్కడికి వచ్చి తమను అనొద్దని, తమతో పడొద్దని సూచించారు.
పేపర్ లీకేజీ ఘటనపై ఐటీశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీతో తనకు, ఐటీ శాఖకు సంబంధమేమిటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర సంస్థ అని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఉండదని స్పష్టంచేశారు. ఐటీ మంత్రి అయినంత మాత్రాన రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్కు తానే బాధ్యుడినా?అని ప్రశ్నించారు. ఇంటర్బోర్డులో, టీఎస్పీఎస్సీలో ఏం జరిగినా తనకే సంబంధం అంటగడుతున్నారని, అసలు తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి ఐటీశాఖ అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. అది తెలిస్తే ఇలాంటి డిమాండ్ చేయరని ఎద్దేవాచేశారు. ఇప్పటివరకు గుజరాత్లో ఎనిమిది పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడ ఆ శాఖ మంత్రిని బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణంలో ఏకం గా సీఎం పేరు బయటకు వచ్చిందని, అక్కడ సీఎంను బర్తరఫ్ చేశారా? అని నిలదీశారు. అస్సాంలో పోలీస్ ఉద్యోగాల పేపర్ లీకైందని అక్కడ ఆ శాఖ మంత్రిని బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. మీడియా కూడా నిజానిజాలు తెలుసుకొని రాయాలని సూచించారు.
మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా టీఎస్పీఎస్సీ పటిష్టతకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పలువురు సాంకేతిక నిపుణులు, ఇతర రంగాల నిపుణులతో మాట్లాడినట్టు వెల్లడించారు. లీకేజీపై ఏర్పాటుచేసిన సిట్ విచారణ ఇంకా కొనసాగుతున్నదని, ఈ విచారణ తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
గత ఎనిమిదేండ్లలో టీఎస్పీఎస్సీ 155 నోటిఫికేషన్లతో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఆయా నియామకాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడే ఇలా ఎందుకు జరిగిందో ప్రతిఒక్కరూ లోతుగా ఆలోచించాలని కోరారు. అవకతవకలు లేని, పారదర్శకతతో కూడిన నియామకాల కోసం ఎనిమిదేండ్లలో సాంకేతికంగా టీఎస్పీఎస్సీని ఎంతో బలోపేతం చేశామని వివరించారు. దేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా టీఎస్పీఎస్సీకి పేరున్నదని చెప్పారు. యూపీఎస్సీ చైర్మన్తో పాటు 13 రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలపై అధ్యయనం చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నోటిఫికేషన్లోనూ ఏపీపీఎస్సీపై అనేక ఆరోపణలు వచ్చేవని గుర్తుచేశారు. అవినీతి లేకుండా, అందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇంటర్వ్యూలనే రద్దు చేశామని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నదని, యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తున్నదని కేటీఆర్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా స్థానికత కోసం ప్రత్యేక చట్టం చేశామని తెలిపారు. ఉద్యమంలో లక్ష ఉద్యోగాల వస్తాయని చెప్పి ఇప్పుడు 2.38 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని తెలిపారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీ మేలు కోరే ప్రభుత్వం. మీ ప్రయోజనాల కోసం, ఉపాధి కోసం నిర్విరామంగా పని చేసే ప్రభుత్వం. మేం మీతో ఉన్నాం. ఆందోళన వద్దు’ అని యువతకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.