హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రజల సమస్యలు గాలికి వదిలి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించిందని, ఆ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు.
‘ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్లటం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయటమే. అదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టంచేశాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ లెకచేయకపోవటం దురదృష్టకరం’ అని ఆయన పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు వెళ్లినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ దృష్టికి తెచ్చామని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ స్పీకర్ పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించామని తెలిపారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మామని తెలిపారు.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని తేలిపోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫాంతో పోటీశారని, ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న లెక్కలేనితనానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేల పదవులు కూడా పోవటం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్రెడ్డి పేర్కొన్న మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? లేదంటే వాళ్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసిన ముఖ్యమంత్రిని కొట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అని పెద్దపెద్ద మాటలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్గాంధీకి పార్టీ ఫిరాయింపుల విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే రేవంత్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన చట్ట సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దయ్యేలా చట్టం తెస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా అంటూ నిలదీశారు. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ రాకుండా చట్టం చేయటం, కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను వందకోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ ఎత్తుకెళ్తున్నదని నానా యాగీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ…దొంగ అని అరుస్తూ ద్వంద్వ నీతికి పాల్పడుతున్నదని దుయ్యబట్టారు.