KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేయాలని హితవు పలికారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ముమ్మాటికీ పీసీసీ నివేదిక అని మేము ముందు నుంచి చెబుతుంది ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందన్నారు కేటీఆర్.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఆ విషయాలతో ఇవాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్షణీయమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు.
రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేటీఆర్ హితవు పలికారు.గోదావరి జలాలను పక్కరాష్ట్రానికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారుకు రైతుల చేతిలోవాతలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతించిన కేటీఆర్
♦️ రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్న కేటీఆర్
♦️ ఇప్పటికైనా రాజకీయ కుట్రలు… pic.twitter.com/wYeRUJqxum
— BRS Party (@BRSparty) April 22, 2026