హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతు ల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గ రైతులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యుత్తు సరఫరా కంపెనీలను ప్రైవేటుపరం చేసి, ఉచిత విద్యుత్తును రైతులకు దూరం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని కేటీఆర్ విమర్శించారు.
ఒక్కసారి విద్యుత్తు సరఫరా కంపెనీలు ప్రైవేటుపరమైతే.. పెట్రోల్ ధరల మాదిరే విద్యుత్తు రేట్లు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ కుట్రలు ఫలిస్తే.. రైతుల మోటర్ల దగ్గర ప్రీపెయిడ్ మీటర్లు పెట్టే పరిస్థితి దాపురిస్తుందని, ముందుగా డబ్బులు కడితేనే కరెంటు పొందాల్సి వస్తుందని హెచ్చ రించారు. అందుకే ప్రాణం పోయినా మోటర్ల వద్ద మీటర్లు పెట్టకుండా కేంద్రంపై పోరాటం చేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్కు బలం ఇచ్చి సమర్థించాలని కోరారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రం లో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కేంద్రం రద్దు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న ధాన్యం సేకరణ ను రద్దు చేసి ప్రైవేటు కంపెనీలకే ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. అదే జరిగితే, రైతుల పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితి ఉండబోదని తెలిపారు.
8 ఏండ్లలో మారిన స్థితిని మరువొద్దు
2014కు ముందు కరెంటు ఉంటే వార్త అని, ఈ రోజు కరెంటు పోతే వార్త అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి మారిందని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం 10 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ, ఏ ప్రధానమంత్రీ ఆలోచించని విధంగా రైతన్నల చేతిలో నగదు పెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గొప్పగా ఆలోచించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.58 వేల కోట్ల నగదుసాయం రైతుబంధు ద్వారా అందించిన ప్రభుత్వం తమదని చెప్పారు. ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఐదు లక్షల రూపాయల రైతుబీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ వివరించారు. కరోనా సంక్షోభ కాలంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల నుంచి ప్రతి ధాన్యపుగింజనూ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పటిదాకా లక్షా 17వేల కోట్ల రూపాయలతో ధాన్యం, ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన వివరించారు.
కృష్ణా నీటివాటా తేల్చడంలేదు..
ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గానికి పిల్లనివ్వాలంటే ఫ్లోరైడ్ భూతాన్ని చూసి భయపడిన పరిస్థితులు ఉండేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ రోజు ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. మునుగోడు నియోజకవర్గపు బీడు భూములను శాశ్వతంగా పంటభూములుగా మార్చేందుకు లక్ష్మణపల్లె, కృష్ణరాయనిపల్లె, శివన్నగూడెం ప్రాజెక్టులు కడుతున్నది తమ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కృష్ణా నీటి వాటాలు తేల్చడంలేదని, పైగా రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
మునుగోడువైపు దేశం మొత్తం చూస్తున్నది..
కేవలం ఒక వ్యక్తి ప్రయోజనం కోసం, ఆయన కంపెనీ కాంట్రాక్టుల కోసం మునుగోడు నియోజకవర్గ ప్రజలపైన రుద్దిన ఈ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నిక కేవలం నియోజకవర్గానికి పరిమితం కాదని, దేశం మొత్తం అటువైపే చూస్తున్నదన్న సంగతి మరువద్దని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు ప్రజామోదం లభించినట్టు అవుతుందని, అందుకే రైతన్నలు ఆలోచించి ఓటేయాలని ఆయన సూచించారు. బీజేపీ అబద్ధపు ప్రచారాలకి లోను కావద్దంటూ రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.