హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నేతన్నలు బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నదనే వార్తలపై ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. పదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం గల వవర్లూం నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూం వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరువూరు వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని తెలిపారు. గత 15 రోజులుగా వస్త్ర పరిశ్రమపై వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకొనే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.