అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదు – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం నుంచి గ్రామస్థాయి వరకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. 60 లక్షల మంది పార్టీ క్రియాశీల కార్యకర్తలను మరింత చైతన్యపరిచేలా విసృ్తత కార్యాచరణ రూపొందించుకొని అమలుచేయాలని ఆదేశించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లా పార్టీ కార్యాలయాలన్నీ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల తో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు రూపొందించారని తెలిపారు. ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని జిల్లాలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకోవాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను వెంటనే సిద్ధం చేయాలని, అధిష్ఠానంతో సమన్వయం చేసుకొని ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలని ఆదేశించారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకులందరి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని అన్నారు. జూన్ 1న అమరవీరుల స్మారకం ఆవిషరణ సందర్భంగా పార్టీ తరఫున విసృ్తత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
పార్టీకి కార్యకర్తలే బలం
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కోరారు. ఒక్కో పట్టణానికి లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకొని సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను కవర్ చేసేలా 10 గ్రామాలను ఒక యూనిట్గా విభజించి.. ఆయా యూనిట్లలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన సంపూర్ణ షెడ్యూల్ (క్యాలెండర్)ను వెంటనే తమకు పంపాలని కోరారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించాయని కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకవైపు దేశంలోనే అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మరోవైపు పరిపాలన ఆత్మగౌరవ చిహ్నం అయిన నూతన సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నామని గుర్తు చేశారు. దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా అమలుచేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదని అన్నారు. మన ప్రభుత్వం, మన పార్టీ చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
జూన్ నుంచి విద్యార్థి విభాగం కార్యక్రమాలు
వచ్చే జూన్లో 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. పార్టీ విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, నూతన కమిటీలను వేసుకోవాలని ఆదేశించారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి కళాశాలల్లో నూతన విద్యార్థులకు స్వాగత సభలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ వారంలో పార్టీ కార్యాలయంలో సమావేశం
ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పార్టీ జెండాల ఆవిషరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా ప్రతినిధుల సభలు నిర్వహించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలు, పార్టీ ఇచ్చిన కార్యాచరణపై ఈ వారంలోనే జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆ సమావేశానికి టెలికాన్ఫరెన్స్లో చర్చించిన కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేసుకొని రావాలని ఆదేశించారు.