KTR | ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు ఈ నెల 7న ములుగు జిల్లా పర్యటించనున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ములుగు కలెక్టరేట్లో పాత్రికేయులతో మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలకు అభివృద్ధి పనులను చేయనున్నారని వివరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రూ.65కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మేడారం శాశ్వత ప్రాతిపదికన రూ.10కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
ములుగు జిల్లా కేంద్రంలో రూ.30లక్షల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణానికి, అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేస్తారన్నారు. రామప్పలో అదే రోజు ఇరిగేషన్ డే గోదావరి జలాలకు పూజలు చేయనున్నారని వివరించారు. రామప్ప రిజర్వాయర్ పూర్తయినా నేపథ్యంలో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలో ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ, గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ 125 యూనిట్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. కేటీఆర్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. మంతి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఎండాకాలం నేపథ్యంలో పది గంటల్లోగా జనాలను తరలించాలని, ఈ మేరకు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఐదు యూనిట్లు 5వేల మందికి తరలించడానికి బ్యాంకు లింకేజీ శ్రీనిధి సీఎస్ సమైక్య నాయకులను మహిళలను సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులను మాట్లాడే విధంగా సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో వృత్తిపై ఆధారపడ్డ విశ్వబ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు. సభ విజయవంతానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సమన్వయoతో ప్రజలను తరలించాలని చెప్పారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.